వైసీపీ నాయకుల నేరచరిత్రను ప్రపంచస్థాయి ఇన్వెస్టిగేషన్ ఛానల్ బయటపెట్టింది: పంచుమర్తి అనురాధ

  • వైసీపీ గొడ్డలి పార్టీ, నేరస్థుల పార్టీ అన్న అనురాధ
  • ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి జగన్ రాజకీయ అనుచరుడని వెల్లడి
  • ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీతో ప్రపంచవ్యాప్తంగా వైసీపీ నేర చరిత్ర బయటపడిందన్న అనురాధ
ప్రపంచస్థాయి ఇన్వెస్టిగేటివ్ ఛానల్ జావా డిస్కవర్ విడుదల చేసిన డాక్యుమెంటరీ వైసీపీ నాయకుల నేరచరిత్రను బయటపెట్టిందని, జగన్ రెడ్డి కిల్లర్ పార్టీ, క్రిమినల్ పార్టీ, గొడ్డలి పార్టీ, మాఫియా పార్టీకి అధ్యక్షుడని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నేర చరిత్ర ఉన్న పొలిటీషియన్ జగన్ రెడ్డి గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీలలో రీసెర్చ్ కేస్ స్టడీగా ఉందని అన్నారు.

ఇప్పుడు కొత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్ 'ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్' అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించిందని తెలిపారు. ఆ డాక్యుమెంటరీలోని నేరచరిత్రలో కొల్లం గంగిరెడ్డి ఉన్నాడని, ఇతను ఒక ఎర్రచందనం స్మగ్లర్ అని ఆరోపించారు. అతను వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి నమ్మకమైన అనుచరుడని తెలిపారు.

కడప జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలిగే సమర్థుడు కొల్లం గంగిరెడ్డి అని ఆమె పేర్కొన్నారు. 2003లో తిరుపతిలో అలిపిరి వద్ద నారా చంద్రబాబునాయుడుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ఇతను ఒక నిందితుడుగా ఉన్నాడని విమర్శించారు. వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులోనూ ప్రధాన నిందితుడు కొల్లం గంగిరెడ్డి అని తెలిపారు. ఇతని సోదరుడు జగన్ మోహన్ రెడ్డి హయాంలో డీసీసీ చైర్మన్‌గా వ్యవహరించారని గుర్తు చేశారు.

ఇలాంటి జగన్ నేర చరిత్ర గురించి ప్రపంచం మొత్తం బట్టబయలు చేసిన ఈ పరిస్థితి గురించి వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. "జగన్ ఎలాంటి వాళ్ళని ప్రోత్సహించారు? ఎలాంటి వాళ్ళని బెయిల్ నుంచి తప్పించారు? మొత్తం తేటతెల్లమైంది" అన్నారు. ప్రపంచస్థాయిలో ఉన్న కంపెనీలతో పరిచయాలు పెంచుకొని ఆ కంపెనీలన్నిటిని ఆంధ్రప్రదేశ్‌కి నారా చంద్రబాబునాయుడు ఏ రకంగా తీసుకువస్తున్నారో అందరూ చూస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి ప్రపంచస్థాయి స్మగ్లర్ తో, నేర చరిత్రలతో ఉన్న వ్యక్తులతో సహవాసం చేశారని ఆరోపించారు.

వైసీపీ పార్టీని గొడ్డళ్ల పార్టీ అంటుంటే వైసీపీ నేతలు గింజుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఉపయోగించే  గొడ్డళ్ళన్నీ ఇడుపులపాయ నుంచి వెళ్లాయని వైసీపీ నాయకులు తెలుసుకోవాలని అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో, అతడిని గొడ్డలితో ఏడుసార్లు నరికి నరికి చంపారని ఆరోపించారు. అలాంటి పార్టీని గొడ్డలి పార్టీ అనకుండా ఏమంటారని ప్రశ్నించారు. 30 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ఏ రకంగా బెయిల్ పై తిరుగుతున్నాడో అదే విధంగా అతని అనుచరుడు కొల్లం గంగిరెడ్డి 27 కేసులతో బెయిల్ మీద బయట తిరుగుతున్నాడని మండిపడ్డారు.

జగన్ రెడ్డి విజయవాడ, తాడేపల్లిని వదిలిపెట్టి బెంగళూరులోనే కూర్చొని నేరాలు, ఘోరాలు పాల్పడడానికి స్కెచ్‌లు వేసుకుంటున్నారని విమర్శించారు. గొడ్డళ్ల పార్టీకి ప్రజలు ఇప్పటికే 11 సీట్లతో సరైన బుద్ధి చెప్పారని అన్నారు. వైసీపీ సంబంధించిన ఏ నాయకుడి వెనుక చూసినా ఒక నేర చరిత్ర ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇన్వెస్టిగేషన్ ఛానల్ లో మరికొంతమంది వైసీపీ నాయకుల నేర చరిత్రలు రాబోతున్నాయని పంచుమర్తి అనురాధ అన్నారు.

Panchumarthi Anuradha
YS Jagan Mohan Reddy
YCP Crime
Java Discover
Kollam Gangi Reddy

More Telugu News